డార్విన్ అంటే అంత వ్యతిరేకత ఎందుకు?
– కె ఎల్ కాంతారావు
అనాది నుండి ప్రపంచంలోని తత్వవేత్తలు, శాస్త్రవేత్తలలో భూమి మీద ఉన్న ఈ జీవులు, మానవుడు ఎలా సృష్టించబడ్డారనే విషయాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండేది. మత గ్రంథాలన్నీ ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులూ, మానవులతో సహా ఒక మానవాతీత శక్తిచే ఇప్పుడున్న రూపంలోనే ఏక కాలంలో సృష్టించబడ్డాయనీ, ఇవి ఇలాగే కొనసాగుతున్నాయనీ చెప్పాయి. బైబిల్ ప్రకారం ప్రపంచమంతా భగవంతునిచే ఆరు రోజుల్లో సృష్టించబడ్డది. హిందూ మత గ్రంథాలు సృష్టిని గూర్చి రకరకాలుగా చెప్పాయి. రామాయణం అరణ్య కాండలో కశ్యప ప్రజాపతికి దేవతలు, దైత్యులు, మానవులు, పశువులు, పక్షులు, పాములు, ఏనుగులు, పెద్ద పులులు, కొండముచ్చులు పుట్టాయని చెప్పారు. మహాభారతం, ఆదిపర్వం, ఒకటవ అధ్యాయం ప్రకారం బ్రహ్మాండమైన గుడ్డు నుండి ప్రజాపతులు, వస్తువులు, యక్షులు, బ్రహ్మర్షులు జన్మించారు. వారి తర్వాత రాజర్షులు జన్మించారు. ఆ తర్వాత వరుసగా నీరు, భూమి, గాలి, ఆకాశం, సంవత్సరాలు, రుతువులు, నెలలు, పక్షాలు, పగలు, రాత్రి ఉద్భవించాయి. ఇలా వివిధ మత గ్రంథాలు సృష్టిని గూర్చి అనేక రకాలుగా చెప్పాయి. ఈ వాదాలను ఖండిస్తూ ఒకరిద్దరు తత్వవేత్తలు జీవులు పరిణామం ద్వారా అవతరించాయి అనే వాదనను తమ సునిశిత పరిశీలన ద్వారా చేసినా, వారు తమ వాదనకు సరైన రుజువులు చూపలేక పోవడంతో, మెజార్టీ ప్రజలు ఆ వాదనను అంగీకరించలేదు. ఉదాహరణకు క్రీ.పూ 400 ప్రాంతానికి చెందిన తత్వవేత్త డెమోక్రటిస్, జీవులన్నీ మట్టి అణువులు కలవేననీ, ఉపాయం, ధైర్యం, వేగం కలిగినవి మాత్రం నిలిచాయనీ, వాటిలో నుండి ఎప్పుడో మనిషి పరిణామం చెందాడనీ ప్రకటించాడు. అలాగే క్రీ.పూ 384-322 కాలం వాడైన అరిస్టాటిల్, ప్రాణులు మరింత ఉన్నత దశకు పరిణామం చెందుతాయనీ, అన్నిటిలోకి ఉన్నతమైనవి వానరాలు అనీ, వాటి కంటే ఉన్నత శ్రేణి నరజాతి అనీ ప్రకటించాడు. భవిష్యత్తులో నరజాతి కంటే ఉన్నతమైనవి రావచ్చునని కూడా భావించాడు. భారత దేశంలో చార్వాకులు గాలి, నీరు, నిప్పు, నేల ఈ నాలుగే మూల భూతాలు. అవి తగిన పాళ్లలో కలవడం వల్లనే ప్రాణులు పుడతాయి అన్నారు. అంతేకాదు, తమలపాకు, వక్క, సున్నం కలయికతో ఎర్ర రంగు ఎలా పుడుతుందో, జడ పదార్థాలుగా ఉన్న చతుర్భూతాల మేళవింపుతో, ప్రాణుల్లో చైతన్యం పుడుతుందని అన్నారు. పై వారందరూ, వారి వాదనలకు బలమైన సాక్ష్యాధారాలు చూపలేకపోయారు. అయితే, 1859లో బ్రిటిష్ శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ ‘ఏకకాలంలోనే సృష్టి’ అనే వాదాన్ని పటాపంచలు చేసి, మనం చూస్తున్న జీవ జాతులన్నీ తమకు ముందు జీవించిన జీవుల నుండి పరిణామం ద్వారా కొత్త జీవులుగా ఆవిర్భవించాయి, అనే పరిణామ వాద సిద్ధాంతాన్ని అనేక సాక్ష్యాధారాలతో ప్రతిపాదించారు. అంతేకాదు, కోతి దశలో ఉన్న జీవి పరిణామం ద్వారా మానవుడుగా మార్పు చెందాడని రుజువులతో నిరూపించాడు. డార్విన్ పరిణామ వాద సిద్ధాం తాన్ని విజ్ఞాన శాస్త్ర ప్రపంచం ఆమోదించింది. రుజువులతో ఉన్న ఏ విషయాన్నైనా ఆమోదిం చడం శాస్త్ర ప్రపంచానికి సహజమే కదా! గత 160 ఏళ్లలో, పై వాదానికి అనుకూలంగా మరిన్ని సాక్ష్యాలు, రుజువులు ఆధునిక శాస్త్రాలైన మాలికులర్ బయాలజీ, జీవ రసాయన శాస్త్రం, జన్యు శాస్త్రాలు చూపించి, డార్విన్ వాదాన్ని మరింత పరిపుష్టం చేశాయి.
డార్వినిజం ఆవిష్కరణ జరిగిన వెంటనే పాలకవర్గం, మతాచార్యులు దానిని ఆమోదించ లేదు. దానిని తిరస్కరించారు. విశేషమేమి టంటే మతాచార్యులు కొన్ని దశాబ్దాల తర్వాత ఏక కాలంలో సృష్టి వాదం, పరిణామ వాదాల మధ్య చర్చ నుండి క్రమంగా వెనుకకు తగ్గారు. చివరకు 1925లో చర్చి నాయకులు ఈ రెండు వాదాల మధ్య లడాయిని శాశ్వతంగా నిలిప ివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, డార్విన్ను గూర్చి అవమానకరంగా మాట్లాడినం దుకు 2008లో చర్చి క్షమాపణ కోరింది. కాని ప్రజల మూఢ నమ్మకాలను పట్టి వుంచాలనే ఆలోచన గల పాలక వర్గాలు ఈ లడాయిని వదలలేదు సరిగదా, వారిపై చర్చను పట్టుదలగా ఏదో ఒక రీతిలో కొనసాగిస్తూనే వున్నాయి. 1990లలో ‘తెలివిగల సృష్టి’ అనే కొత్త వాదాన్ని వారు లంకించు కున్నాయి. ఆ వాదం సృష్టికర్తలు ఛాప్మన్, మేయర్ అయినా దానిని అమెరికా అధ్యక్షుడు బుష్ 2005 అక్టోబరులో అందుకొని ‘పరిణామ వాదాన్ని, తెలివిగల సృష్టికర్త వాదాన్నీ రెండింటినీ పాఠశాలల్లో బోధించాలి’ అన్నాడు. అలా రెండు వాదాల్నీ విన్న విద్యార్థులు గందర గోళంలో పడిపోతారు. అదే పాలక వర్గాలకు కావలసింది. కాని, ఆశ్చర్యకరంగా, చర్చి ప్రతినిధులు ఈ చర్చలో తల దూర్చడానికి ఇష్టపడక పోవడమే గాక సృష్టి వాదం శాస్త్రీయ ఆధారాలు గల సిద్ధాంతంగా సైన్సు క్లాసుల్లో బోధించ కూడదని ప్రకటించారు. ( ది హిందూ,18.9.2008 )
ఈ పరిస్థితుల్లో భారతదేశ పాలక వర్గం దానికి నాయకత్వం వహిస్తున్న బిజెపి, ప్రజలలో మూఢ నమ్మకాలు పెంచే అనేక చర్యలు చేపడుతోంది. వారి నాయకులు అనేక ప్రకటనలు చేస్తున్నారు. ప్రధానమంత్రే స్వయంగా వినాయకుడి కథ అనేక వేల సంవత్సరాల కిందట, భారత శాస్త్రజ్ఞులకు ప్లాస్టిక్ సర్జరీ తెలుసుననే విషయాన్ని రుజువు చేస్తున్నదని ప్రకటించడం బాధాకరం. వినాయకుడి కథ కృతయుగంలో జరిగిందని పురాణాలు పేర్కొంటున్నాయి. అంటే వినాయకుడి కథ ఇప్పటికి 22 లక్షల సంవత్సరాల కిందటిదని పౌరాణికులందరూ అంగీకరిస్తున్నారు. చరిత్ర, పురాతత్వ శాస్త్రం ఏం నిరూపిస్తున్నాయి? 22 లక్షల ఏళ్ల క్రితం మానవుడు పచ్చి మాంసం తినే అత్యంత అనాగరిక స్థితిలో ఉన్నాడని నిరూపిస్తున్నాయి. ఇక ప్లాస్టిక్ సర్జరీ చేయగలిగిన శాస్త్ర విజ్ఞానం ఆనాటికెక్కడిది? అది దేవుడి కథ, మేం నమ్ముతాం అని ఎవరైనా అంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు కాని ఆ కథలో సైన్సు ఉందంటే నిరూపించమంటాం. ఇక ఇప్పుడు కొత్తగా వారి దాడి డార్వినిజం పైకి మరలింది. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ ఒక వైదిక సమ్మేళనంలో మాట్లాడుతూ ‘డార్విన్ పరిణామ వాద సిద్ధాంతం తప్పు. మానవుడు మొదటి నుండి మానవుడుగానే వున్నాడు’ అన్నారు. అంతకంటే ముఖ్యంగా ఆయన చేసిన వాదన ఏమిటంటే, ‘మన పూర్వీకులు కోతి మానవుడుగా మారడాన్ని ఎవరూ చూడలేదు. మన అమ్మమ్మలు, తాతయ్యలు అలాంటి విషయాలు ఎప్పుడూ చెప్పలేదు’ అన్నారు.
ఇదేమి వింత? ప్రపంచం మొత్తంలోని శాస్త్ర లోకం అంతా సాక్ష్యాలు, రుజువులతో కూడిన డార్విన్ సిద్ధాంతాన్ని ఆమోదిస్తుంటే, మన అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పలేదనే కారణంతో ఆ విజ్ఞాన విషయాన్ని తిరస్కరిస్తామా? కేవలం వాళ్లు చెప్పినవే అంగీకరిస్తామా? అలా అయితే పావురాళ్లు, ఎలుకలు, పులులు, మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడు కున్న పంచతంత్ర కథలు వాస్తవమని అంగీకరించాలి. ఎందుకంటే అవి తాతయ్యలు చెప్పిన కథలు గదా!
మన కేంద్రమంత్రికి డార్విన్పై అంత కోపం ఎందుకు? పరిశీలిద్దాం.
డార్విన్ పరిణామ వాదపు వెలుగులో పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఇప్పటికి 44 లక్షల సంవత్సరాల క్రితం కోతి దశ నుండి వెన్నెముక నిటారుగా కలిగిన మానవుడు పరిణామం చెందాడనీ, ఇప్పటికి 20 వేల సంవత్సరాల కిందటి వరకూ అత్యంత అనాగరికుడుగా జీవించాడనీ, 20 వేల సంవత్సరాల క్రితమే నిప్పును తయారుచేయడం నేర్చుకున్నాడనీ, అప్పటి నుండే మానవ నాగరికత అభివృద్ధి చెందిదనీ, ఇప్పటికి 5 వేల సంవత్సరాల క్రితమే మేడలు కట్టే నాగరికత మానవ సమాజంలో అభివృద్ధి అయిందనీ నిరూపించారు. ఇది అంగీకరిస్తే 22 లక్షల సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ సర్జరీ మన వాళ్లు చేశారనే విషయం, త్రేతాయుగంలో అంటే ఇప్పటికి 9 లక్షల సంవత్సరాల క్రితం బంగారు కిరీటాలు ధరించినవారూ, బంగారు మేడలలో నివసించేవారూ ఉన్నారనే విషయం వాస్తవ విషయాలు కాకుండా, ‘ప్రజల నమ్మకాలలో భాగంగా మిగిలిపోతాయి. వారు నిర్మించదలచుకున్న సమాజం అది కాదు. వారి సిద్ధాంత వేత్త ఆశీష్ నంది ఆ సమాజాన్ని గూర్చి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజల దృక్పథంలో మార్పు రావాలి. కాని ఆ మార్పు అశాస్త్రీయ దృక్పథం నుండి శాస్త్రీయ దృక్పథానికి మాత్రం కాదు. సైన్సు ఆధిపత్యాన్ని అంగీకరించే దృక్పథం నుంచి మానవ ఔన్నత్యాన్ని, ఆ ఔన్యాత్యానికి పునాది వేసే జీవిత పరిస్థితులను మళ్లీ ప్రచారంలోకి తీసుకొని వచ్చే దృక్పథానికి ఆ మార్పు రావాలి. ఆ పునాదిలో అనేక సంప్రదాయాలు, మతం, పురాణ గ్రంథాలు ఉంటాయి’. ( మెయిన్ స్ట్రీమ్ పత్రిక 10.10.1981 )
ఎంత స్పష్టంగా చెప్పారు. సైన్సు ఆధిపత్యాన్ని అంగీకరించే దృక్పథం వద్దట! పురాణ గ్రంథాలు పునాదిగా గల సమాజం కావాలట! అసలు సైన్సంటే ఏంటి? నిరూపించబడిన విషయాల సమాహారం! దానిని వదలివేస్తే సమాజం ఏమవుతుంది? ప్రజలు రుజువులు లేని విషయాలనే అంగీకరిస్తే, మనం మరల మధ్య యుగాల లోనికి పోమా? మూఢ నమ్మకాలలో కూరుకుపోమా? మన పాలకులకు సైన్సు అందించే అన్ని ప్రయోజనాలూ కావాలి. సైన్సు అందించిన ఎసి కార్లూ, విమానాలూ, సెల్ఫోన్లూ, అన్నీ కావాలి. కాని సైంటిఫిక్ థీరీలు మాత్రం వద్దు. అలా శాస్త్రీయ ప్రపంచానికి తలుపులు బార్లా తీసిన డార్విన్ అంటే వారికి అందుకే అంత కోపం. ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలి. శాస్త్రీయ దృక్పథం మీద ఆధారపడిన సమాజం కోసం కృషి చేయాలి. అలాంటి సమాజాన్ని వ్యతిరేకించే వారి గుట్టు రట్టు చేయాలి. శాస్త్రీయ విజ్ఞానం మీద ఆధారపడిన మహోన్నత భారతదేశం కోసం నిర్విరామ కృషి చేయాలి.