అత్యంత అద్భుతమైన, అత్యంత ఆసక్తికరమైన, అత్యంత అర్థవంతంగా బోధపడిన ఖగోళ శాస్త్రాన్ని అత్యంత దుర్మార్గంగా, అత్యంత నీచంగా అన్వయించే విధానాలే జ్యోతిష్యశాస్త్రాలు, పంచాంగ తిథి వార నక్షత్ర రాశీ ఫలాలు. సాధారణంగా మనం చూసే దైనందిన పరిశీలన ఏమిటి? సూర్యుడు తూర్పున ఉదయాన్నే పైకి లేస్తాడు. అలా అలా తలపైన ఆకాశంలో వెళుతూ పడమర క్రిందికి దిగి కనిపించకుండా పోతాడు. మళ్లీ కొన్ని గంటల (సుమారు 12గంటలు) తర్వాత ఇదే దృశ్యం పునరావృతం అవుతుంది. అటు తూర్పున సుముద్రం వుంది. ఇటు పడమర కూడా సముద్రం వుంది. కాబట్టి ఎవరికైనా పై పరిశీలనకు సమాధానాన్ని గానీ వివరణను గానీ ఏమిస్తారు? సముద్రంలోంచి లేస్తాడు. సముద్రంలో కలుస్తాడు. మధ్యలో సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని. అంతేకాదు నక్షత్రాలు కూడా ఈ ఆకాశంలో ముగ్గు చుక్కల్లాగా వివిధ బిందువుల దగ్గర వుంటాయి. దగ్గర దగ్గర ఉన్న నక్షత్రాలను గీతలతో కలిపి ఊహిస్తే మనం రోజూ ఊసే ఏదో ఒక ఆకారానికి దగ్గరగా వున్నట్లు తోస్తుంది. చాలాసార్లు మనం పేపర్లలో గణేషుని పోలిన బొప్పాయి పండు అని చూస్తాము. మూడు తలల చిలగడ దుంపలు బ్రహ్మదేవుణ్ణి పోలి వున్నాయి అంటూంటారు. మేఘాలు మారుతూ వున్నప్పఉడు ఒకసారి ఏనుగులాగా, మరోసారి సింహంలాగా ఇంకోసారి చెట్టులాగా, మరోసారి కుండలాగా అనిపిస్తాయి. ఇలా నక్షత్రాల సముదాయాన్ని కూడా వివిధ ఆకృతుల్లోకి ఊహించారు. సూర్యుడు 24 గంటలకోసారి ఆకాశంలో ప్రయానిస్తున్నట్లు అనిపించినా దాదాపు నెలరోజుల వరకూ రాత్రిళ్లు ఒకే భంగిమలో వున్న నక్షత్ర రాసుల్ని చూస్తాము. రాత్రుళ్లు మనకు కనిపించే నక్షత్రాల రూపురేఖలకు పేర్లు పెట్టారు. సూర్యుడు తూర్పునుంచి, పడమర వైపు వెళుతున్నట్టనిపిస్తున్నాడు కాబట్టి ఆ దారిలో వున్న నక్షత్ర రాశుల్ని సౌరపథంలో సూర్యుడి నేపథ్యంగా భావించారు. ఆ నక్షత్రరాశుల పేర్లే తుల, మేషం, మిధునం, సింహరాశి, మత్స్యరాశి, కన్యారాశి, వృశ్ఛిక రాశి, ధనురాశి మొదలైనవి. సూర్యుణ్ణి చంద్రుణ్ణి ప్రత్యక్షంగా చూడగలము. ఎక్కువ వేగంగా గమనాన్ని మార్చుకొంటూ నక్షత్రాల్లాగే వెలుగుతున్నట్టు కనిపించే కొన్ని గ్రహాల్ని పూర్వీకులు గుర్తించారు. అందులో బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని వున్నారు. ఇవి నక్షత్ర రాశుల కన్నా వేగంగా తమ స్థావరాల్ని మార్చుకొంటుండడం వల్ల అవి కూడా తూర్పున ఉదయించి పడమర అస్తమించడం వల్ల సూర్యచంద్రుల్లాగా వీటినీ గ్రహాలు అన్నారు. తద్వారా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని భూమిచుట్టూ తిరిగే గ్రహాలుగా భావించారు. అడపాదడపా పట్టపగలే సూర్యుడిలో కోతలు వచ్చి సౌరగ్రహణం రావడం, పౌర్ణమిగా పూర్ణ బింబాన్ని చూపవలసిన చంద్రుడు ఆరోజే కనిపించకుండా చంద్రగ్రహణం రావడం అందరికీ అద్భుతంగా, విడ్డూరంగా, వింతగా, అంతుపట్టని విషయంగా తోచింది. కాబట్టి అందుకు కూడా ఎవరో కనిపించని గ్రహాలే కారణమని భావించి రాహువు, కేతువు అనే రెండు అదనపు రహస్య గ్రహాల్ని ఊహించారు. తర్వాత తొమ్మిది గ్రహాలు (నవగ్రహాలు) భూమి చుట్టూ తిరుగుతున్నట్టు పరిశీలనలకు భాష్యం చెప్పుకున్నారు. నిజానికి కంటికి కనిపించే పరిశీలనలకు ఈ వివరణ చాలా చక్కగా సరిపోతుంది. వివిధ కాలాల్లో సూర్యుడు వివిధ నక్షత్ర సముదాయాలు (Zodiac or Constelletion) మీదుగా ఆకాశంలో ప్రయాణిస్తున్నట్టు భావించారు. నడిచే వారికి, సైకిలో కారో వుండాలి కదా! ఆ రోజుల్లో వాహనాలుగా ఊహించడానికి రధాలు, గుర్రాలు తప్ప మరొకటి దొరకలేదు. పైగా అడపాదడపా వర్షం వచ్చినప్పుడల్లా ఇంద్రధనుస్సు వస్తోంది. అదీ కాంతి ఉంటేనే వస్తోంది. కాంతి లేకుంటే లేదు కాబట్టి సప్త వర్ణాలకు కాంతే కారణం అనుకున్నారు. అందువల్లే ఏడు వర్ణాలున్న ఏడు గుర్రాల స్వారీతో పనిచేసే ఆ రథం మీద సూర్యుణ్ణి ఆకాశంలో వెళుతున్నట్టు రూపొందించారు. కానీ కనిపించే ప్రతి పరిశీలనకు స్వీయ మానసిక ప్రవృత్తితో వివరణ యిచ్చుకొని సంభాళించుకోవడం సబబుకాదని, శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాల ద్వారా నిజాన్ని నిగ్గు తేల్చుకోవాలని సైన్సు చెబుతోంది. హైపేషియా, బ్రూనో, కోపర్నికస్, గెలీలియో వంటి మహనీయులు, త్యాగధనులు చేసిన వాదనలు, పరిశీలనలు, ప్రయోగాల ద్వారా భూమి కేంద్రంగా గ్రహాలు, నక్షత్రాలు తిరగట్లేదని, సూర్యుడు కేంద్రంగా భూమితోపాటు యితర గ్రహోపగ్రహాలు తిరుగుతున్నాయని ఘంటాపథంగా ఋజువైంది. రాహువు, కేతువు కల్లబొల్లి కబుర్లని, సూర్యగ్రహణానికి, చంద్రగ్రహణాలు చంద్రుడు భూమికే పరిమితమని సంపూర్ణంగా అర్థమైంది.అయినా మత ఛాందసులు రాహువు, కేతువుల్ని వదలడంలేదు. నక్షత్రమైన సూర్యుణ్ణి గ్రహం నుంచి తప్పించడం లేదు. ఉపగ్రహమైన చంద్రుడు కూడా పంచాంగాల్లో గ్రహ కోవలో బెంగపడుతూనే వున్నాడు.
ఈ విశాల విశ్వంలో కొన్ని లక్షల గెలాక్సీలు వున్నాయి. ప్రతి గెలాక్సీలో కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనం వున్న నక్షత్ర రాశి (గెలాక్సీ) పేరు పాలపుంత లేదా మిల్కీవే గెలీక్సీ. ఇందులో ఓ మూల సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి తర్వాత మనకు అత్యంత దగ్గరగా వున్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారి. అది సుమారు 4.5 (నాలుగున్నర) కాంతి సంవత్సరాల దూరంలో వుంది. దీని విలువ 4.5×365×24×3600×3×10^5 కి.మీ. అంటే సుమారు 42600000 కోట్ల కి.మీ. ఇలా దూరదూరంగా విసిరేయబడ్డ నక్షత్రాల గుంపులో మన సౌరమండలం వుంది. సూర్యుడి చుట్టూ, భూమి తిరుగుతున్నపుడు మనకు భూమి స్థిరంగా ఉన్నట్టు సూర్యుడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సూర్యుడి చుట్టూ ఓసారి భూమి తిరిగి రావడానికి 12 నెలలు లేక సుమారు 365 రోజులు (లేదా సంవత్సరం) పడుతుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే పరిభ్రమణోపరితలాన్ని ఎక్లిప్టిక్ అంటారు. మనం రంగుల రాట్నంలో తిరుగుతున్నప్పుడు మధ్యలో వున్న స్తంభం స్థిరంగా మన గుర్రం మీద వృత్తాకారంలో తిరుగుతాము. అపుడు మధ్యలో వున్న స్తంభాన్ని సూర్యుడని, మనం వున్న గుర్రాన్ని భూమిగా అనుకొంటే మనం తిరుగుతున్నపుడు స్తంభం వెనుక దృశ్యాలు మారుతుంటాయి. ఒకసారి స్తంభం వెనుక దూరంగా గట్టు గుట్ట వుండవచ్చును, తర్వాత వెనువెంటనే ఏదో పెద్ద వేపచెట్టు రావొచ్చును. ఆ పిదప పెద్ద బిల్డింగ్ తారసపడవచ్చును. అలా తిరిగే క్రమంలో సూర్యుడి వెనుక వున్న నక్షత్ర రాశుల ఆకారాలు ఏమిటో ఆ సందర్భంలో సూర్యుడు ఆ రాశిలో ప్రవేశించినట్టు చెబుతారు. అలాగే సూర్యుడి చుట్టూ తిరిగే ఇతర గ్రహాలయిన బుధుడు, గురుడు (బృహస్పతి) కూడా సాపేక్షంగా ఏదో ఒక రాశికి ముందర ఉన్నట్టు భూమి మీదున్న మనకు అగుపిస్తుంది. మరో తమాషా ఏమిటంటే 12 నక్షత్ర రాశుల్ని సామ్రాజ్యాలుగా వాటిని అజమాయిషీ చేసే పాలకులుగా నవగ్రహాలను భావించారు. అంటే ఒక్కో నక్షత్ర రాశికి ఒక్కో గ్రహం అధిపతి అంటారు. ఆ విధంగా మన పంచాంగాల్లో సింహరాశికి అధిపతి సూర్యుడు. వృశ్చిక రాశికి అధిపతి చంద్రుడు. ఇదెలా ఉందంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పరిపాలించే అధిపతి వరంగల్ పట్టణంలోని మా యింట్లో పైకప్పు మీద వున్న బల్లి అన్నట్టు వుంటుంది. ఎందుకంటే సింహరాశిలో ఉన్న నక్షత్రాలు సూర్యుడికి కొన్ని వందల రెట్లు పెద్దవి వున్నాయి. పైగా అవి కొన్ని లక్షల కోట్ల కి.మీ. దూరంలో వున్నాయి. అలా రాశి గురు గ్రహానికి వెనుక సింహరాశి (లియో) అయినట్లయితే గురుడు సింహరాశిలో ప్రవేశించినట్లు భావిస్తారు. అక్కడితో ఆగిపోతే ఎవరికీ ఇబ్బందిగానీ, అభ్యంతరం గానీ లేకపోను. కానీ ఆ గ్రహమేదో కొన్ని లక్షల కోట్ల కి.మీ. దూరంలో వున్న నేపథ్యం ముందర వుంటే ఇక్కడ ఆ గ్రహం నుంచి కొన్ని కోట్ల కి.మీ. దూరంలో భూమి మీదున్న మన మీద నక్షత్ర ప్రభావం వుంటుందని అశాస్త్రీయ వాదన చేయడమే ఛాందసత్వం.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు,
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.
email: allikayala
ప్రజాశక్తి దినపత్రిక నుండి, ఏప్రిల్ 26,2017